Nara Lokesh : లండన్ లో మంత్రి నారా లోకేష్ రోడ్ షో!

Update: 2025-09-17 06:09 GMT

విశాఖలో నవంబర్ 14, 15తేదీల్లో ఎపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లండన్ లో హైప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా రాత్రి 7గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30గంటలకు) నిర్వహించే ఈ రోడ్ షోలో యుకె డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ హర్షూల్ అస్నానీ, ఐసిఐసిఐ బ్యాంకు యుకె విభాగం సిఇఓ రాఘవ్ సింఘాల్, ఎపిఐఐసి వైస్ చైర్మన్ & ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150మంది సిఇఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు పాల్గొంటారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, గత 15నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను మంత్రి లోకేష్ వివరిస్తారు.

గత 15నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల కోసం ఒక లక్ష ఎకరాల భూమి కలిగిన పారిశ్రామిక క్లస్టర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరోఏడాదిలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలన్నది ఎపి ప్రభుత్వ లక్ష్యం. లండన్ రోడ్‌షోలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ప్రఖ్యాత సంస్థలైన హిందుజా, రోల్స్ రాయిస్ వంటి గ్రూప్‌లతో ప్రత్యేక సమావేశాలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పెట్టుబడిదారులతో ఫైర్‌సైడ్ చాట్ నిర్వహించనున్నారు. రోడ్‌షో సందర్భంగా మంత్రి లోకేష్ ఎపిలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీరంగం వంటి అంశాలను హైలైట్ చేస్తారు. పెట్టుబడులతోపాటు శాశ్వత ఆర్థికావకాశాలను ఇన్వెస్టర్లకు వివరిస్తారు. రోడ్ షోలో ఎరిక్సన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సియాంట్, ఇవాంటె గ్లోబల్, ఏఐ ఓపెన్‌సెక్, లండన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో పాటు ఇతర పరిశ్రమ ప్రముఖులు కూడా హాజరవుతారు. నవంబర్ లో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా గ్లోబల్ కంపెనీల సిఇఓలు, పాలసీ మేకర్లు, ఇండస్ట్రీ లీడర్లను మంత్రి లోకేష్ ఆహ్వానిస్తారు. ట్రేడ్, టెక్నాలజీ, స్థిరమైన వృద్ధి అంశాలపై లండన్ రోడ్ షోలో కీలక చర్చలు జరగనున్నాయి.

Tags:    

Similar News