Mizoram: మిజోరంలో విమాన ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు
ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన సైనిక విమానం;
మిజోరంలో మయన్మార్ ఆర్మీకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. మిజోరం రాజధాని ఐజ్వాల్లోని లెంగ్పుయ్ ఎయిర్పోర్టులో మంగళవారం ఉదయం 10:19 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి, రన్వేపై స్కిడ్ అయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితం సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడి తమ దేశ సైనికులను వెనక్కి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 13 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
భారత్లోకి చొరబడిన మయన్మార్ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా మయన్మార్లో సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య అంతర్యుద్ధం జరగుతున్నది. దీంతో ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరానికి వస్తున్నారు. ఇలా గతవారం దేశంలోకి చొరబడిన 276 మంది సైనికుల్లో 184 మందిని తిరిగి మయన్మార్కు పంపినట్లు అస్సామ్ రైఫిల్స్ కు చెందిన అధికారులు వెల్లడించారు. మిగిలిన 92 మందిని నేడు పంపనున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 635 మంది మయన్మార్ సైనికులు భారత్లోకి చొరబడ్డారు.
మణిపూర్ సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారాన్ని నియంత్రిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దుల మాదిరిగానే మయన్మార్ సరిహద్దులో కూడా త్వరలో కంచె వేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 19న ప్రకటించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల మాదిరిగానే మయన్మార్తో భారత్ సరిహద్దులను కూడా పరిరక్షిస్తామన్నారు. మయన్మార్తో చేసుకొన్న సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారానికి సంబంధించిన ఒప్పందం(ఎఫ్ఎంఆర్)పై పునఃపరిశీలన చేస్తామని, త్వరలో దానికి ముగింపు పలుకుతామని తెలిపారు. ప్రసుత్తం రెండు దేశాల మధ్య అమల్లో ఉన్న ఒప్పందం మేరకు భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని 16 కిలోమీటర్ల పరిధిలో నివసించే ఇరుదేశాల ప్రజలు వీసా లేకుండా, ఎలాంటి భద్రతా తనిఖీలు లేకుండా ఒకరి భూభాగాల్లోకి మరొకరు వెళ్లేందుకు అవకాశం ఉన్నది.