AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముంగిట డీఎస్సీ

AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముంగిట డీఎస్సీ
నేటి నుంచే టెట్‌ దరఖాస్తుల స్వీకరణ.... 12 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల ముందు డీఎస్సీ-2024 షెడ్యూలు విడుదలైంది. ఏడు యాజమాన్యాల్లో కలిపి 6,100 పోస్టులను భర్తీ చేయనున్నామని, ఉపాధ్యాయ నియామకాలతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. టెట్‌కు నేటి నుంచి, డీఎస్సీకి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించామని తెలిపారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించినట్లు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. డీఎస్సీ, టెట్‌ రెండింటికీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయిస్తామని కమిషనర్‌ సురేష్‌కుమార్‌ వెల్లడించారు.


మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట ప్రాతిపదికన కేంద్రాలను కేటాయించనున్నట్లు తెలిపారు. డీఎస్సీ, టెట్‌పై సందేహాలకు నేటి నుంచి సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని, వెబ్‌సైట్‌లో వివరాలు పెడతామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఉదయం విడత 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మొత్తం 2,280 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు ప్రకటిస్తే వీటిలో దాదాపు సగం పోస్టులు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ఈ జిల్లాలో 1,022 ఎస్జీటీ ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవంగా ఈ జిల్లాలో 1,750 ఎస్జీటీ ఖాళీలున్నాయి. మొదట 2,150 పోస్టులు అవసరం కానున్నట్లు ప్రతిపాదించిన అధికారులు ఆ తర్వాత వీటిని 1,750కి.. అనంతరం 1,022కు కుదించారు.

ప్రస్తుతం ఈ జిల్లాలో ప్రాథమిక స్థాయిలో 37మందికి ఒక ఎస్జీటీ ఉన్నారు. ఇక్కడ పోస్టులు తక్కువగా ఉండటంతో గతేడాది ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్లు కలిపి 1,870 మంజూరు చేశారు. ఇందులో 900వరకు ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్‌ బోధన కోసమంటూ 300మంది ఎస్జీటీలకు సబ్జెక్టు టీచర్లుగా పదోన్నతులు కల్పించారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులు జోనల్‌ స్థాయివి కాగా.. ప్రిన్సిపల్‌ పోస్టులను రాష్ట్ర కేడర్‌గా పరిగణిస్తారు. ఏపీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సొసైటీలో మాత్రం టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ రాష్ట్రస్థాయి పోస్టులుగానే పరిగణిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story