AP: ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

AP: ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
X
కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు … 6వ తేదీ వరకు అమల్లో ఎన్నికల కోడ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఉంటుందని చెప్పారు. 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని అప్పటివరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ కు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. 21 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతోపాటు, అదనపు బలగాలు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా.... అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి హింస జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు భద్రతా చర్యలన్నీ చేపట్టామని..... విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద... లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులను మినహా.... ఎవరినీ లోనికి అనుమతించబోమని... స్పష్టం చేశారు.

గుంటూరు పార్లమెంటుతో పాటు... 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు....ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని 5 భవనాల్లో జరగనుందని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 2,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తుషార్‌ దూడి తెలిపారు. తిరుపతి జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 16 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున ఏజంట్లు ఉదయం 7 గంటల్లోపే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని......అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 315 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ గౌతమి సాలి చెప్పారు.

తెలంగాణలోనూ 17లోక్‌సభ స్థానాల ఎన్నికల లెక్కింపునకు సంబంధించి ఈసీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది ఈ నెల 4న జరిగే కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు అనంతరం ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లు, మరో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు ఉంటుందని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఈవీఎం కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత..... ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేసి వీవీ ప్యాట్లను లెక్కిస్తామని తెలిపారు. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్లను సరిపోల్చుతామని వెల్లడించారు.

Tags

Next Story