BJP: జగన్‌ది రాక్షస పాలన

BJP: జగన్‌ది రాక్షస పాలన
ప్రజలంతా వైసీపీ బాధితులే అన్న పురందేశఅవరి... జగన్ అబద్దపు ప్రచారాలపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న రాక్షస పాలనలో ప్రజలంతా వైసీపీ బాధితులేనని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దుగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఎన్నికల ముందు ప్రతి వేదికపైనా బీసీలంటూ ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పురందేశ్వరి మండిపడ్డారు. ఏపీని అన్ని విధాలా అధోగతి పట్టించిన పాలన జగన్ ది అన్న ఆమె ఇవి చాలవన్నట్లుగా సచివాలయం, ఏపీలో గనులు కూడా తనఖా పెడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందు మద్య నియంత్రణ చేస్తామని, ఇప్పుడు కల్తీ మద్యాన్ని ఏరులై పారించారని పురందేశ్వరి మండిపడ్డారు.

లోకేశ్‌ సెటైర్లు

కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానం అమలు చేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో ఆయన సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చాక మైనింగ్ అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్న లోకేశ్ అవినీతి సొమ్మును కక్కిస్తామని చెప్పారు. వైకాపా పాలనలో పెంచిన ధరలను తగ్గిస్తామన్నారు. అక్రమ మద్యం నియంత్రణ పాలసీని తీసుకొస్తామన్న ఆయన వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. జగన్ రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వెళ్తే, ఆస్కార్ తో సహా భాస్కర్ అవార్డు కూడా వస్తుందని లోకేశ్ ఎద్దేవా చేశారు.


మరోవైపు పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తనకు లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేందుకు కృషి చేస్తామని కూటమిలోని పార్టీలు ప్రకటించడం..హర్షణీయమన్నారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. పిఠాపురంలో NDA కూటమి కార్యకర్తలతో సమావేశమైన పవన్ .. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. తెలుగుదేశం నేత వర్మ త్యాగం గొప్పదన్న పవన్ ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు చాలా సమర్థవంతమైన నాయకుడని పవన్ కొనియాడారు. తాను రాష్ట్ర ప్రజల కోసం తగ్గానని తెలిపారు. చంద్రబాబు చాలా అనుభవజ్ఞుడని... అందరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పవన్‌ వెల్లడించారు.

మరోవైపు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగాకర్నూలు, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. ముందుగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రాంతాన్ని జగన్‌ ఐదేళ్లుగా దగా చేశారని.. మండిపడ్డారు. సీమలో వెనకబడిన వర్గాలను నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరు సిద్ధం సభలో జిల్లాకు చెందిన తమ అభ్యర్థులందరూ పేదవాళ్లంటూ జగన్‌ చెప్పిన మాటలకు.. చంద్రబాబు కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ పాలనలో30ఏళ్లు వెనక్కెళ్లిన ఏపీని..పునర్నిర్మించేందుకే బీజేపీతో జతకట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమిలో ఉన్నామైనార్టీల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్నారు. సామాజిక న్యాయానికి బ్రాండ్‌ అంబాసిడర్‌.తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు..తమ అభ్యర్థుల్లో బీసీలకు పెద్దపీట వేశామన్నారు. సీమలో ఏకపక్షంగా తన సామాజికవర్గానికే సీట్లిచ్చిన జగన్‌..సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story