AP: ముఖ్యమంత్రిగా చంద్రబాబు..ఉప ముఖ్యమంత్రిగా పవన్‌

AP: ముఖ్యమంత్రిగా చంద్రబాబు..ఉప ముఖ్యమంత్రిగా పవన్‌
24 మంది మంత్రుల జాబితా విడుదల.... డిప్యూటీ సీఎంగా పవన్‌ ఒక్కరే

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణం చేస్తారు. ఉపముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఉంటారు. పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేశ్‌లతో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి,పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డిలకు చోటు లభించింది.


సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 14 మంది కొత్తవారికి అవకాశం కల్పించగా , ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. ఆశావహులు, మద్దతుదారులు జాబితా కోసం నరాలు తెగేంత ఉత్కంఠతో ఎదురు చూశారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. తెలుగుదేశం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో పోరాట పంథాలో ఉన్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, బాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత వంటివారికి ప్రాధాన్యమిచ్చారు.

మొత్తంగా జాబితాను పరిశీలిస్తే పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ సహా మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్,.. సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిలు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు. 10 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు,వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్‌రెడ్డి ఎనిమిది మంది పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి, మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధిలు గతంలో మంత్రులుగా చేసిన వారు.

యనమల రామకృష్ణుడు, కిమిడి కళావెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి,... ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనంద్‌బాబు,..... కాలవ శ్రీనివాసులు, నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, కొండ్రు మురళి, కూన రవికుమార్‌, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, కన్నా లక్ష్మీనారాయణ, చినరాజప్ప,కొనతాల రామకృష్ణ, కామినేని శ్రీనివాసరావు వంటి సీనియర్లకు ఈసారి నిరాశ ఎదురైంది.

Tags

Next Story