CBN: అసెంబ్లీకి రా.... జగన్కు చంద్రబాబు సవాల్

వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై తాము శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిదని చెప్పాలని సవాల్ విసిరారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలని అన్నారు. శాసనసభకు రాకుండా అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడతారా అంటూ చంద్రబాబు నిలదీశారు. జగన్ పాలనలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారని అధికారిక గణాంకాలతో తాము వెల్లడిస్తుంటే.. రూ.7.48 లక్షల కోట్లే అప్పు చేశామంటూ వైసీపీ అధినేత అసత్యాలు ఎలా చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ చెబుతున్నట్లుగా రూ.2.71 లక్షల కోట్లే బటన్ నొక్కి పంపిణీ చేస్తే.. రూ.9.74 లక్షల కోట్ల అప్పు ఎందుకయ్యిందో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో కొనసాగిన ఆర్థిక అరాచకం, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై శ్వేతపత్రాన్ని చంద్రబాబు శాసనసభలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రసంగించారు. ‘మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. పదేళ్లపాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చారని చంద్రబాబు తెలిపారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం పేరిట రూ.14,275 కోట్లు, వ్యాట్ను పక్కన పెట్టేసి స్పెషల్ మార్జిన్ రూపంలో రూ.26,673 కోట్లు దారి మళ్లించారని ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రంలో పేర్కొన్నారు. వీటికి జవాబు చెప్పకుండా ఆయన తప్పించుకుంటారా’ అని చంద్రబాబు నిలదీశారు . విశాఖపట్నాన్ని రాజధానిగా చేయటమంటే ఆ నగరంలోని విలువైన ఆస్తుల్ని తాకట్టు పెట్టటమా అని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ గవర్నర్కు ఫిర్యాదు చేసిన జగన్మోహన్రెడ్డిలో ఏ మాత్రం నిజాయతీ, ధైర్యం, సిగ్గు ఉన్నా హత్యకు గురయినవారి పేర్లు వెల్లడించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్లు ఇవ్వాలని,,. వాటికి బాధ్యులెవరో గుర్తించి చర్యలు తీసుకుంటామని...దానికి జగన్ సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీగా కొనసాగాలనుకుంటే తమ డిమాండును అంగీకరించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో రాజకీయ హత్యల్లో చనిపోయినవారి పేర్లు, చంపినవారి పేర్లు తాము వెల్లడించామని … జగన్కు దమ్ముంటే ఆయన ఆరోపిస్తున్నట్లుగా హత్యకు గురైన 36 మంది పేర్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. వినుకొండలో హత్యకుగురైన రషీద్, హత్య చేసిన వ్యక్తి ఇద్దరూ మొన్నటి వరకూ వైసీపీలోనే ఉన్నారని, ఈ కేసులో నిందితుణ్ని అరెస్టు చేశామని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన రాజకీయ హత్యల కేసుల్ని తిరిగి తెరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com