CBN: ఏపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయి, వ్యవస్థలు దెబ్బ తిని వెంటిలేటర్పై ఉందని గుర్తు చేశారు. ప్రజలు 93 శాతం స్ర్టైక్ రేట్తో ఇచ్చిన విజయంతో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించి ఏపీని ఆదుకుందని చంద్రబాబు అన్నారు. వెంటిలేటర్ నుంచి బయటపడ్డామని.. కానీ ఇంకా పూర్తిగా రాష్ట్రం కోలుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను కరవు రహిత రాష్ట్రంగా చేసేందుకు గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని ఆలోచిస్తున్నామని, దీనికి కేంద్రసాయం అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కోరారు. రాష్ట్ర విభజన, 2019లో వచ్చిన అసమర్థ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని.. వైసీపీ ప్రభుత్వం రూ.10లక్షల కోట్ల అప్పులు చేసిందని... వాటికి వడ్డీలు కడుతూనే హామీలను అమలుచేస్తున్నామని తెలిపారు.
వైసీపీ పాలనలో ఘోర పరిస్థితులు
విజయవాడ సమీపంలోని కొండపావులూరు వద్ద జరిగిన ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కలసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్నికల ముందు పది లక్షల కోట్లకు పైగా అప్పులు.. రాజధాని పూర్తిగా విధ్వంసం.. కొట్టుకుపోయిన పోలవరం డయా ఫ్రమ్ వాల్.. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. అమరావతికి 15 వేల కోట్ల సాయం కేంద్రం నుంచి అందడంతో రాజధాని పనులు వేగవంతమయ్యాయని, పోలవరం డయా ఫ్రమ్ వాల్ పనులు తాజాగా మొదలయ్యాయని, ఈ రెండింటినీ పూర్తి చేసి తీరుతామన్నారు. దేశంలో ఏ మూల సమస్య ఉన్నా పరిష్కారానికి పట్టుదలతో కష్టపడే అమిత్ షా శాంతిభద్రతల పరిరక్షణలో వినూత్నంగా ఆలోచిస్తుంటారని చంద్రబాబు కొనియాడారు. సమస్యలపై లోతుగా అధ్యయనం చేసే అమిత్ షా నేతృత్వంలో దేశ నలుమూలలా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కొనియాడారు. ఆయన పనితీరు చూసి అప్పుడప్పుడు తాను అసూయ పడుతుంటానని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
విశాఖ ఉక్కుకు ప్రాణం పోశారన్న సీఎం
సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో వినూత్నంగా ఆలోచించాలంటూ అమిత్ షా చేసిన సూచన తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల సాయంతో కేంద్రం ప్రాణం పోసిందని, ఆంధ్రుల చిరకాల వాంఛ రైల్వే జోన్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్నారు. అలాగే గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com