AP: బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తోంది. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా పయనిస్తోంది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రణాళిక రచిస్తోంది. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంపై నేడు మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు.
మరిన్ని కీలక నిర్ణయాలు..!
గత టీడీపీ ప్రభుత్వంలో అమలైన ఎన్టీఆర్ విదేశీవిద్య, విద్యోన్నతి పథకాలను పునరుద్ధరించాలని కూడా సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు లబ్ధిదారులుగా ఉన్న పథకాల నిబంధనల్లో మార్పులు చేయాలని, ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా నిబంధనలు సవరించాలని ఆయన చెప్పారు. 26 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్ నిర్మాణాలు చేపట్టాలని, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం సూచించారు. ఇక బీసీ స్టడీసర్కిళ్లు నిధులు లేక కార్యకలాపాలు స్తంభించాయని, వాటికోసం వెంటనే రూ.10 కోట్లు విడుదల చేయాలని చెప్పారు. సచివాలయంలో బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమశాఖల సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. బీసీ రిజర్వేషన్ ఫైల్ సహా ఇతర కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
బీసీ సంక్షేమ శాఖపై సచివాలయంలో చంద్రబాబు సమీక్షించారు. ఏపీలో 139 బీసీ ఉపకులాల వారికి లబ్ధి చేకూర్చేలా కార్పొరేషన్లను పునర్ వ్యవస్థీకరించడానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. 56 బీసీ కార్పొరేషన్లను పునర్ వ్యవస్థీకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కులాలు, ఉప కులాల వారీకా కార్పొరేషన్ల పునర్ వ్యవస్థీకరణ ఉండాలన్నారు. బీసీల అభ్యున్నతికి కేంద్రం కూడా పలు పథకాలు అమలు చేస్తోంది. ప్రతి ఏడాదీ రూ.100కోట్ల మేర రాయితీ రుణాలు అందిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రబుత్వం రూ.38 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ గా విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ నిధుల్ని తక్షణం విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇక గత ప్రభుత్వం వదిలి పెట్టిన బకాయిల విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గురుకుల విద్యార్థులకు రూ.110 కోట్ల మేర డైట్ ఛార్జీలు, రూ.20.52 కోట్ల మేర కాస్మొటిక్ ఛార్జీలను గత ప్రభుత్వం బకాయి పెట్టిందని, వాటిని తమ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com