AP Doctor : ఆస్ట్రేలియాలో ఏపీ డాక్టర్ హఠాన్మరణం

విదేశాల్లో మరో తెలుగు విషాదం జరిగింది. ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా ఆమె గడిపిన సమయం మృత్యువును ఆహ్వానించింది. వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో డాక్టర్ గా పనిచేస్తోంది. చదువుకుంటూనే ప్రాక్టీస్ చేస్తోంది. ఈ మధ్యనే స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లింది. దురదృష్టవశాత్తూ ఈ యువ వైద్యురాలు లోయలో పడి దుర్మరణం చెందింది.
ఆస్ట్రేలియా గోల్డ్కోస్ట్లోని బాండ్ విశ్వవిద్యాలయంలో వేమూరు ఉజ్వల ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో ఆమె పని చేస్తోంది. మార్చి 2న సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన ఉజ్వల.. ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఉజ్వల మరణించడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఉజ్వల తల్లిదండ్రులైన వేమూరు వెంకటేశ్వరరావు, మైథిలి కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు.
అంత్యక్రియల నిమిత్తం శనివారం భౌతిక కాయాన్ని ఏపీ ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com