AP HC: విశాఖలో ఎన్ని రోజులుంటారు..?

AP HC: విశాఖలో ఎన్ని రోజులుంటారు..?
ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు.... ఏపీ ప్రభుత్వాకిని హైకోర్టు సూటి ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం క్యాంపు కార్యాలయాల ముసుగులో అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను తిరిగి త్రిసభ్య ధర్మాసనానికే పంపుతామని ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది. అప్పటి వరకు సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై స్టేకు నిరాకరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు సంధించింది. విశాఖలో ఎన్ని రోజులుంటారు? ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు? ఎంత మంది ఉద్యోగులను తీసుకెళుతున్నారో... పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.


అమరావతి నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ యు. దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో సాగర నగరానికి కార్యాలయాలను తరలిస్తున్నారని హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్‌పై...శుక్రవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలను వినిపించారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నామన్న ఉద్దేశంతో సింగిల్‌ జడ్జి స్టే ఇచ్చారన్న ఆయన నిజానికి కార్యాలయాలను తరలించట్లేదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి పనుల సమీక్ష కోసం సీఎం క్యాంప్‌ కార్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని....సమీక్ష నిమిత్తం హాజరయ్యే అధికారులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నామని కోర్టుకు చెప్పారు.


అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నామని పిటిషనర్లు తప్పుగా అర్థం చేసుకొని వ్యాజ్యాలు దాఖలు చేశారన్న ఏజీ...సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటుపై గతంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపిన నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలు అక్కడే విచారణ జరపాలని... సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించాల్సిన అవసరం లేదని వాదించారు. రాజధాని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపినా, సింగిల్‌జడ్జి వద్దకు పంపినా అభ్యంతరం లేదన్నారు. ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని కోరారు.

ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఎంతమంది ప్రభుత్వోద్యోగులను విశాఖకు తీసుకెళుతున్నారు? అక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారనే వివరాల పట్టికను ఇవ్వాలని ఆదేశించింది. అమరావతి నుంచి కార్యాలయాలను తరలించొద్దని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఉద్దేశం నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం...విశాఖలో కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో అక్కడికి కార్యాలయాలను తరలిస్తున్నారన్న భావనతో సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండొచ్చని అభిప్రాయపడింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవరించాలా? ఎత్తేయాలా? అలాగే కొనసాగించాలా? అనే విషయాన్ని నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. వ్యాజ్యాలపై తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story