Chandrababu: సీఎం జగన్ ఎంత అప్పు తెచ్చారో చెప్పి తీరాల్సిందే: చంద్రబాబు
Chandrababu: సీఎం జగన్ అవినీతికి ఎప్పటికీ అడ్డుపడుతూనే ఉంటామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నెక్కల గొల్లగూడెంలో పర్యటించిన ఆయన..జగన్ దోపిడీకి అడ్డుకట్ట వేసి తీరాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అడవినెక్కలంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి పర్యటన మొదలుపెట్టారు చంద్రబాబు. మొదట పాదయాత్ర చేపట్టాలని భావించినా.. కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావడంతో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. బీసీ, ఎస్సీ వర్గాలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. నెక్కలం గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్న చంద్రబాబు.. రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యాన పంటలకు ఎలాంటి రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఉన్నత విద్యకు రుణాలు ఇవ్వడం లేదన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. విదేశీ విద్యా పథకం అమలు కావడం లేదని చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
ఎంత అప్పు తెచ్చారో జగన్ చెప్పి తీరాలన్నారు. పోలవరం అవినీతి అంటూ ప్రచారం చేశారని..డయాఫ్రమ్ వాల్ కొట్టుకెల్లి మూడు సీజన్లు దాటినా దానిని పట్టించుకోలేదన్నారు. ప్రజలను పట్టించుకోని వైసీపీని ఉరి తీయాలన్నారు. అంతకుముందు చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని రావిచర్ల సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేశారు, తర్వాత గజమాలతో చంద్రబాబును సత్కరించారు. చంద్రబాబు రాకతో నెక్కలం గొల్లగూడెం పసుపు మయంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com