YCP: వైసీపీలో అంతర్గత కుమ్ములాట

YCP: వైసీపీలో అంతర్గత కుమ్ములాట
మంగళగిరి నియోజకవర్గంలో మూడు ముక్కలాట.... ఆధిపత్య పోరుతో సతమతం...

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీలో మూడు ముక్కలాట నడస్తోంది. అధికార పార్టీ శ్రేణులు ఆర్కే, వేమారెడ్డి, చిరంజీవి వర్గాలుగా విడిపోయారు. ఆధిపత్యపోరు, అభివృద్ధి పనులు పక్కనపెట్టడంపై విజయసాయిరెడ్డిని నేరుగానే కొందరు నిలదీశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది.స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైసీపీని వీడినప్పటికీ ఆయన వర్గం ఒక గుంపుగా, ప్రస్తుత సమన్వయకర్త గంజి చిరంజీవి వర్గం ఇంకో జట్టుగా..తాడేపల్లి-మంగళగిరి వైసీపీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మరో వర్గంగా చీలిపోయారు. బలంగా ఉన్న ఆర్కే వర్గాన్ని అణగదొక్కి తన పరపతి చాటుకునేందుకు వేమారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గంజి చిరంజీవి తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు పార్టీలో నియామకాలు చేసుకుంటున్నారు. ఈ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విజయసాయిరెడ్డి,మర్రి రాజశేఖర్‌ నిన్న( సోమవారం) వైసీపీ కేంద్ర కార్యాలయంలో 3గ్రూపుల్ని సమావేశపరిచారు.


ఎమ్మెల్యే ఆర్కే నియమించిన తాడేపల్లి పట్టణ వైసీపీ కమిటీని ఇటీవలే వేమారెడ్డి రద్దు చేశారు. తన వర్గీయులు అంజిరెడ్డి అధ్యక్షతన కొత్త కమిటీని ప్రకటించారు. ‘అసలు మేం పార్టీలో ఉన్నామా? లేమా? ఎవరికి తోచినట్లు వారు కమిటీలను వేసుకుంటూ పోతున్నారు’అని వేమారెడ్డి తొలగించిన తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వేణు..సాయిరెడ్డిని ప్రశ్నించారు. ‘వేణునే మా అధ్యక్షుడు’అంటూ వేణు వర్గీయుడొకరు కేకలేయగా...... సాయిరెడ్డి అతడిని గదమాయిస్తూ ‘ఇలా మీ ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయొద్దు. ఏం చేయాలో చూసి మేం నిర్ణయం తీసుకుంటాం’అని మందలించారు. ‘పార్టీలో కమిటీలు వేసే అధికారం తనకూ లేదని, జగన్‌ వేసేవే పార్టీ కమిటీలని సాయిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో వేమారెడ్డి అవమానంగా భావించి కినుక వహించారు. మంగళగిరి పట్టణ వైసీపీ అధ్యక్షుడుగా ఇటీవల గంజి చిరంజీవి కొత్త వ్యక్తిని నియమించారు. ఇప్పుడా నియామకం చెల్లుబాటు అవుతుందా కాదా అని సమావేశానంతరం బయటకొచ్చాక నేతలు మాట్లాడుకున్నారు.

సమావేశంలో భాగంగా అభివృద్ధిని పట్టించుకోకపోవడాన్ని కొందరు నేతలు సాయిరెడ్డిని ప్రశ్నించారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇంటి నుంచి హెలిప్యాడ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న పాత వంతెనకు మరమ్మతు చేస్తామని చెప్పి చాలాకామైందని తాడేపల్లికి చెందిన నాయకులు ప్రస్తావించారు. సీఎం ఇంటి వద్ద వంతెననే పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించేవారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఐతే.. ఇప్పుడు సమయం లేదని, ఎన్నికల తర్వాతే పనులు పూర్తి చేస్తాం’అని సాయిరెడ్డి వారికి చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story