Andhra Pradesh: ఏపీలో డీఎస్పీ ప్రమోషన్లపై నాడు జగన్ ఆరోపణలు అబద్ధమే.!

Andhra Pradesh: ఓ సామాజిక వర్గంపై విషం చిమ్మడం.. పదేపదే అబద్ధాలతో ప్రజల్లో విద్వేషాలు నింపడం.. ఎన్నికల ముందు ఈ ఫార్ములాను సక్సెస్ఫుల్గా అమలు చేసింది YCP. చివరికి అధికారంలోకీ వచ్చింది. ఇక ఇప్పుడు అదే YCP నాడు తాము చేసిన ప్రకటనలు తప్పని సభాముఖంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో DSPల ప్రమోషన్ల విషయంలో నాడు జగన్ నానాయాగీ చేశారు.
37 మందికి ప్రమోషన్ వస్తే అందులో 35 మంది చంద్రబాబు కులం వారే ఉన్నారంటూ ఢిల్లీకి వెళ్లి మరీ, ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు. తీరా ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. 3 ఏళ్ల కిందటి విషయం ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది.. YCP సర్కారు ఎందుకు దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఓసారి చూసే ముందు నాడు జగన్ ఏ ఆరోపణలు చేశారో చూద్దాం.
అలాగే ఆరోజే చంద్రబాబు దానికి ఎలాంటి కౌంటర్ ఇచ్చారో చూద్దాం. విన్నారు కదా.. ఇవీ జగన్ మాటలు. 2019 ఫిబ్రవరిలో ఆయన ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు తన కులానికి చెందిన CIలకు DSPలుగా ప్రమోషన్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. ECకి కంప్లైంట్ చేశారు. దీంతో.. YCP సోషల్ మీడియా వాళ్లు రెచ్చిపోయారు. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలతో బురద చల్లారు.
నాటి ప్రభుత్వం ఈ ఆరోపణలు అవాస్తవం అంటూ ఒరిజినల్ లిస్టును, ప్రమోషన్లు పొందిన వారిలో ఏ కులం వారు ఎంత మంది అనే వివరాల్ని వెల్లడించినా కూడా నమ్మలేనంత బలంగా ఆ అబద్ధాన్ని జనంలోకి తీసుకెళ్లారు వైసీపీ వాళ్లు. అప్పుడు ఈ విషయంలో జరిగిందేంటో సభా వేదికగానే ప్రజలకు వివరించేందుకు TDP ప్రయత్నించింది. ఆ పార్టీ సభ్యులు డోల బాల వీరాంజనేయస్వామి, బెందాళం అకోక్, మంతెన రామరాజు దీనిపై ప్రశ్న అడిగారు.
దీంతో.. ఈ నోటీసుకు హోంశాఖ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఏకపక్షంగా ఒకే కులానికి ప్రమోషన్లు ఇవ్వడం లాంటిదేమీ జరగలేదు అంటూ స్పష్టం చేశారు. ఈ విషయంపై హోంమంత్రి సుచరిత లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఒకే సామాజికవర్గానికి 37 మంది CIలను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ప్రమోట్ చేశారా అంటూ TDP సభ్యులు ప్రశ్నించారు.
అలాగే ప్రమోషన్ పొందిన 37 మంది వివరాలు కావాలన్నారు. ఒకవేళ ఈ ప్రమోషన్ల వల్ల ఎవరనా నష్టపోతే వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కోరారు. దీనికి సమాధానం ఇచ్చిన హోంశాఖ మంత్రి సుచరిత.. ప్రమోషన్లు ఏకపక్షంగా ఒకే కులానికి ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అలాగే ఏ ఒక్కరికీ అన్యాయం జరగలేదని కూడా స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు.
అంటే నాడు YCP అధినేతగా, విపక్షనేతగా జగన్ చెప్పింది తప్పని తేలింది. తమ సభ్యుల ప్రశ్నకు హోంశాఖ ఇచ్చిన సమాధానంపై సభలో మాట్లాడేందుకు నిమ్మల ప్రయత్నించారు. ఐతే.. స్పీకర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో సభలో నిన్న స్వల్ప వాగ్వాదం జరిగింది. DSPల ప్రమోషన్ల విషయంలో YCP తీరును ఎండగడుతూనే గతంలో ఏం జరిగిందో మీడియాకు వివరించారు టీడీపీ సభ్యులు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు పదోన్నతులు ఇచ్చారు. 2017లో ఒకసారి తర్వాత 2018లో ఒకసారి అర్హులకు ప్రమోషన్లు ప్రకటించారు. ఆ లిస్టుల ప్రకారం చూస్తే ఒకసారి 17 మంది OCలకు, 12 మంది BCలకు, ఆరుగురు SC సామాజికవర్గానికి చెందిన వారు, ఒక ST అధికారికి ప్రమోషన్లు లభించాయి. మరోసారి ప్రమోషన్ల లిస్టులో OCలు 15 మంది ఉంటే, BCలు 12 మంది, SCలు ఐదుగురు, STలు ముగ్గురు ఉన్నారు.
దీనిప్రకారం చూస్తే ఒకే సామాజికవర్గానికి ఏకపక్షంగా ప్రమోషన్లు ఇచ్చారు అని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదనే విషయం స్పష్టమైంది. ఎవరికీ ఎక్కడా అన్యాయం జరగలేదని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీస్ అన్నీ పరిశీలించిందని తేలింది. ఇవన్నీ ప్రజల దృష్టికి తెస్తున్న టీడీపీ….. అమరావతిలో ఒకే కులం వారు ఉన్నారని చెప్పడం, సొంత సామాజికవర్గం వారికే ప్రమోషన్లు ఇచ్చారని YCP విమర్శించడం అన్నీ అవాస్తవం అని ఆధారాలతో నిరూపిస్తోంది.
మిగతా అంశాల్లోనూ వాస్తవాలతో YCPని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు అప్పటి హోంమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. నాడు తమపై నిందలు వేసిన వాళ్లే, ఇప్పుడు నిజమేంటో సభకు తెలిపారని అన్నారు. YCP ఇకనైనా ఇలాంటి విష ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com