CM Chandrababu : పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు

CM Chandrababu : పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు
X

పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా అధికారులు పని చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ‘గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారు. వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. తక్షణమే ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను బాగుచేయాలి. నిత్యావసర సరకుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్లను బాగు చేయడం ఒక విధానం అయితే... తక్షణం ప్రజల కష్టాలు తీర్చేందుకు రహదారులపై గుంతలు పూడ్చడం, వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు.. ఏ మేర దెబ్బతిన్నాయి అనే విషయంలో సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు.

రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా... ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags

Next Story