Rains in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండి

తెలుగు రాష్ట్రాల్లో మరో 2, 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మే 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇది మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయిగుండంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ప్రస్తుతానికి ఏపీ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ఆవర్త ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. దీని కారణంగా తెలంగాణలో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో సోమవారం భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. అలాగే ఏపీలో ఉమ్మడి చిత్తూరు, కృష్ణా, తూ.గో, ప.గో, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com