Heatwaves : వర్షాల్లేవు.. మళ్లీ ఎండలే!

నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు తెలంగాణ లోనూ జూన్ 1 వరకు పొడివాతావరణం కొనసాగనుంది.
నేటి నుంచి ఏపీలో ఎండ ప్రభావం చూపనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 165 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,149 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. నిన్న అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.
నిన్న తెలంగాణలో ఈదురుగాలులు, ఆకాల వర్షాల ధాటికి వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మరణించారు. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు చనిపోగా, హైదరాబాద్లో నలుగురు, మెదక్లో ఇద్దరు మరణించారు. మరోవైపు పలు జిల్లాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. జగిత్యాలలోని జైనలో అత్యధికంగా 46.5 డిగ్రీలు నమోదైంది. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com