SIT: అల్లర్లపై ముమ్మరంగా సిట్‌ విచారణ

SIT: అల్లర్లపై ముమ్మరంగా సిట్‌ విచారణ
X
పల్నాడు, తిరుపతి ప్రాంతాల్లో సిట్‌ బృందం దర్యాప్తు.... అల్లర్లకు సంబంధించిన వీడియోలు, ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలన...

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజు.... ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో... పల్నాడు, తిరుపతి ప్రాంతాల్లో సిట్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. అల్లర్లకు సంబంధించిన వీడియోలు, F.I.Rలను......... అధికారులు పరిశీలించారు. పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఈ వివరాలతో కూడిన నివేదికను సిట్‌ బృందం డీజీపీకి అందజేయనుంది.


ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై.... ఎన్నికల కమిషన్‍ ఏర్పాటు చేసిన సిట్‍ బృందం దర్యాప్తులో వేగం పెంచింది. తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఘర్షణ కేసు వివరాలను S.V.U క్యాంపస్‍ పోలీస్‍ స్టేషన్‌లో సిట్‌ బృందం పరిశీలించింది. సిట్‍ సభ్యులు.. డీఎస్పీ మనోహరాచారి... S.V.U క్యాంపస్‍ పోలీస్‌ స్టేషన్‌ S.I, C.Iలను విచారించారు. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పులివర్తి నానిపై..... హత్యకు యత్నించిన మహిళా విశ్వవిద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం..చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లిలో విచారణ చేశారు. కూచివారిపాలెంలో దాడులపై గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు అందజేయాలని కోరారు. తర్వాత.... రామిరెడ్డిపల్లె సర్పంచ్‍ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌ మెన్ ఈశ్వర్‌ను విచారించారు.


క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత నివేదికను అందజేస్తామని సిట్‍ సభ్యులు D.S.P మనోహరాచారి తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రతి ప్రాంతాన్ని సందర్శించి బాధితులను కలుస్తామని, ప్రతి F.I.Rనూ పరిశీలిస్తానని చెప్పారు. ఎన్నికలు ఆ తర్వాత జరిగిన హింసపై నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్ల సమయంలోని వీడియోలను పరిశీలించారు. సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్న నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ కు మంత్రి అంబటి రాంబాబు రావడం చర్చనీయాంశమైంది. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై సిట్‌కు ఫిర్యాదు చేసేందుకు అంబటి రాంబాబు వచ్చారు.

మరోవైపు... పోలింగ్‍ ముగిసిన తర్వాత చంద్రగిరి మండలం కూచివారిపల్లె గ్రామస్ధులపై వైసీపీ మూకలు దాడికి పాల్పడిన దృశ్యాలను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మురళీధర్‌ ప్రదర్శించారు. ఓటు వేసేందుకు వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులపై దాడి చేయడంతో పాటు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్‍ ముగిసిన తర్వాత..... వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అతని సోదరుడు హర్షిత్ రెడ్డి తమ అనుచరగణంతో గ్రామంపై దండెత్తారని వాపోయారు. హర్షిత్ రెడ్డి అనుచరులతో వస్తున్న దృశ్యాల్ని మురళీధర్‍ ప్రదర్శించారు. గ్రామంపై దాడిచేసిన దృశ్యాలు, అక్రమ కేసుల వివరాలను ఆధారాలతో సహ సిట్‌కు వివరిస్తామని మురళీధర్ స్పష్టం చేశారు.

Tags

Next Story