AP : రుషికొండ ప్యాలెస్ నాకివ్వండి: చంద్రబాబుకు సుఖేశ్ లేఖ

విశాఖలోని రుషికొండ ప్యాలెస్ను తనకు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ( CM Chandrababu Naidu ) మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్ర ( Sukesh Chandra ) లేఖ రాశారు. మార్కెట్ ధర కంటే 20% అదనంగా చెల్లిస్తానని, లీజుకైనా ఇవ్వాలని ఆయన కోరారు. తన లేఖను కొనుగోలు ఒప్పందంగా పరిగణించాలని తెలిపారు. తన బాల్యం విశాఖలోనే గడిచిందన్నారు.
కాగా జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్థిక మోసాల ఆరోపణలపై తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ కు జైలు నుంచి లేఖలు రాయడం కొత్త కాదు. దేశంలో సంచలనం సృష్టించే అంశాలను లక్ష్యంగా చేసుకుని లేఖలు రాయడం అతడికి అలవాటే. ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, రుషికొండలో ప్రభుత్వ భవనాలను అత్యంత విలాసవంతంగా నిర్మించారు. రూ.500 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి ఒక ప్యాలెస్ను నిర్మించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ భవనం కోసం విదేశాల నుంచి దిగుమతి అయిన మార్బుల్స్, టైల్స్ను గదుల్లో ఉపయోగించారు. దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూంలు, భవనం లోపల విలాసవంతమైన నడకదారులు, ఖరీదైన షాండ్లియర్లు, 400 మంది ఒకేసారి సమావేశమయ్యేలా మీటింగ్ రూంలు ఏర్పాటు చేశారు. భవనాల బయట ఎటు చూసినా పచ్చదనం, భవనాల లోపల నుంచే ఎటు చూసినా సముద్రం కనిపించేలా దీన్ని నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com