SC: జగన్‌ కేసుల విచారణలో ఆలస్యం ఎందుకు?

SC: జగన్‌ కేసుల విచారణలో ఆలస్యం ఎందుకు?
అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించిన సుప్రీంకోర్టు... బాధ్యులెవరని ప్రశ్న

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కింది కోర్టులో జరుగుతున్న జాప్యంతో తమకు సంబంధం లేదని సీబీఐ వాదించగా మరి ఇందుకు బాధ్యులెవరని సుప్రీం ధర్మాసనం మండిపడింది. పలుకుబడిఉన్న నాయకుల కేసులను త్వరగా విచారించాలని తెలంగాణ హైకోర్టు దిగువ కోర్టునుఆదేశించినట్లు జగన్ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఫలితంగా విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది.


జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యానికి కారణమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆలస్యానికి తాము బాధ్యులం కాదని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పగా ఇంకెవరు బాధ్యత వహిస్తారని సుప్రీం ధర్మాసనం నిలదీసింది. కింది కోర్టులో వాయిదాలతో సీబీఐకి సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ప్రశ్నలు సంధించారు. ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా జగన్‌ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. అందువల్ల ఈ పిటిషన్‌పై విచారణ ముగించాలని కోరగా... ముగించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున 3 నెలల గడువిచ్చి, ఆ తర్వాత పరిశీలించాలని జగన్‌ న్యాయవాదులు విన్నవించారు. సమయం ఇచ్చి ఉపయోగం ఏంటన్న ధర్మాసనం... దీనివల్ల ఎలాంటి ఫలితం లేదని వ్యాఖ్యానించింది.


ఓ కేసు విచారణ ఇన్నిసార్లు వాయిదా పడటం, ఇంత కాలయాపన జరగడం ఏంటని మరోసారి ప్రశ్నించింది. రాజకీయ దృక్పథంతో రఘురామరాజు పిటిషన్‌ వేశారని జగన్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. వైసీపీ చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నట్లు వివరించారు. రఘురామరాజుపై అనర్హత పిటిషన్‌ వేయడంతో అందుకు ప్రతిగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. అయితే రాజకీయ వ్యవహారాలను తాము పరిశీలించడం లేదన్న సుప్రీంకోర్టు... కేవలం న్యాయపరమైన అంశాలనే చూస్తున్నట్లు స్పష్టంచేసింది. విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందన్నదే ప్రధానమైన అంశమని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఉద్ఘాటించారు. ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్‌ పిటిషన్‌ అయినా పరిష్కరించారా అని ధర్మాసనం నిలదీసింది.

పలుకుబడి ఉన్న వ్యక్తులు కేసులు త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని గత ఏడాది డిసెంబర్‌ 15న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున... ఏం జరుగుతుందో చూద్దామని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ తొలి అర్ధభాగంలో చేపట్టనున్నట్లు ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story