CBN: జగన్ సానుభూతితో గెలవలేవ్‌

CBN: జగన్ సానుభూతితో గెలవలేవ్‌
పెడన సభలో చంద్రబాబు స్పష్టీకరణ... జగన్‌ భయపడేలా తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి

సానుభూతి రాజకీయాలతో ఈసారి జగన్‌ ఎన్నికల్లో గెలవలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, భాజపా కలిశాయని పెడన సభలో వెల్లడించారు. కల్తీ మద్యంతో ఆడపడుచుల తాళిని తెంపేస్తున్న జగన్‌ భయపడేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. పెడన ఎమ్మెల్యే దోడీపీని అరికట్టి... ప్రజల కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.


ప్రజాగళం యాత్రలో భాగంగా పెడనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌పై ఇరువురు నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్‌.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఇప్పడు కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. నాపై, పవన్‌పై దాడి జరిగితే రాయి కనిపించింది. కానీ, జగన్‌పై పడిన రాయి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. జగన్‌పై రాయిదాడిని మేం ఖండించాం.. కానీ, తమపై రాయిదాడి జరిగితే జగన్‌ ఖండించలేదన్నారు. చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌ ప్రజాగళం సభకు మూడు పార్టీల శ్రేణులు భారీగా తరలి రావడంతో కృష్ణాజిల్లా పెడన జన ప్రభంజనమైంది. పెడన బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభావేదిక వరకు రోడ్ షో ద్వారా ఒకే వాహనంలో ఇద్దరు నేతలు చేరుకున్నారు.


భీమవరం నుంచి పిఠాపురం మారానని. జగన్ చాలా బాధపడుతున్నారని పవన్‌ ఎద్దేవా చేశారు. పార్టీ అభ్యర్థులను వైసీపీ ఎందుకు మార్చిందో చెప్పాలని ప్రశ్నించారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి జగన్‌ సారా వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీ మద్యం తాగి... 18 ఏళ్లకే యువత తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని. ఆవేదన వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చాక దోపీడీదారులు అందరినీ శిక్షిస్తామని పవన్ ప్రకటించారు.

ఎన్నికలపై ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ కూటమికే అనుకూలంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. గతంలో కోడికత్తి, గొడ్డలి డ్రామాలు ఆడిన జగన్‌ ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలను గెలిపించేందుకే మూడు పార్టీలు కలిశాయని వివరించారు. పెడనకు పరిశ్రమలు తీసుకువస్తామని, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. బందరు పోర్టు వస్తే స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి వస్తుందని చంద్రబాబు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story