MLC Ashok Babu: అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్.. కుటుంబసభ్యుల ఆందోళన..

MLC Ashok Babu (tv5news.in)
MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షులు అశోక్బాబును సీఐడీ అరెస్టు చేసింది. అర్థరాత్రి అశోక్బాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 11 గంటల 15 నిమిషాలకు అశోక్బాబు ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు.. ఆయన్ను అరెస్టు చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత అర్థరాత్రి 12 గంటల 15 నిమిషాలకు అశోక్బాబు ఇంటికి అరెస్ట్ నోటీసు అంటించారు సీఐడీ సీఐ అమ్మిరాజు.
అశోక్బాబుపై 477-A, 466, 467, 468, 471, 465, 420, ఆర్డబ్ల్యూ-34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నోటీసులో వెల్లడించారు. ఉద్యోగంలో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. మరోవైపు అశోక్బాబును సీఐడీ అధికారులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ ఖండించారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ కక్ష సాధింపులో భాగంగా సర్వీస్ మేటర్స్లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. అశోక్బాబును అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే అశోక్బాబుపై అధికార పార్టీ కక్ష కట్టిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించాల్సిందేనని చంద్రబాబు హెచ్చరించారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే అశోక్బాబును ప్రభుత్వం కక్ష కట్టి.. అక్రమంగా అరెస్టు చేసిందని నారా లోకేష్ ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com