నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం.. కీలక అంశాలపై చర్చ

Chandrababu File Image
TDP Polit Bureau Meet: వైసీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానలే ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం ఇవాళ జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న పొలిట్ బ్యూరో సమావేశంలో వివిధ ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. దాదాపు పన్నెండు అంశాలనూ పొలిట్ బ్యూరో ఎజెండాగా రూపొందించారు. అందులో ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం, సహజవనరుల దోపిడీ అనే అంశాలపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరగనుంది.
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు టీడీపీ పోలిట్ బ్యూరో ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు వివిధ ప్రజా సమస్యలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపి-తెలంగాణల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై పోలిట్ బ్యూరోలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు సీఎం జగన్ వైఖరిని తప్పు పడుతున్నారు.
ఇవాళ జరిగే పొలిట్ బ్యూరో ఈ అంశంపై ప్రధాన చర్చ అనేది జరగనుంది. దీంతోపాటు రైతులకు ధాన్యం బకాయిలు పెండింగ్, పంటలకు లభించని గిట్టుబాటు ధరలు, రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం, పోలవరం నిర్వాసితులకు పునరావాసం - పరిహారం, కొవిడ్ బాధితులకు పరిహారం చెల్లింపు, కుదేలైన ఆర్ధిక వ్యవస్థ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, నిత్యావసర ధరల పెరుగుదల, ఖనిజ దోపిడి, తదితర అంశాలపై చర్చ జరపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వీటితో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ పరంగా చేయాల్సిన పోరాటాల ఎజెండా రూపొందించబోతుంది టీడీపీ. ఇన్ని రోజులు కరోనా వల్ల కాస్త ఆచితూచి అడుగువేసిన టీడీపీ,ఇక నుండి ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా వెళ్ళాలని భావిస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై బాగా ఫోకస్ చేసిన టీడీపీ... ఇప్పుడు జాబ్ కాలెండర్పై పోరాటానికి సిద్ధం అవుతుంది. ఏపీలో అక్కడక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ భావిస్తుంది. ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలనేది పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇటీవల కాలంలో పార్టీ హైకమాండ్ ఏ కార్యక్రమం చేపట్టినా.. అన్ని నియోజకవర్గాల్లో కలిసి కట్టుగా ప్రభుత్వంపై నిరసన గళం విప్పుతున్నారు టీడీపీ నేతలు. ఇక మీదట అదే టెంపో కంటిన్యూ చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ప్రజా సమస్యలపై పోరాడాలని టీడీపీ భావిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com