AP: జగన్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ

AP: జగన్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
ఎన్నికల విధులకు టీచర్లు... సచివాలయ సిబ్బందికి అప్పగించాలని భావించిన వైసీపీ సర్కార్‌...

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల విధుల నుంచి టీచర్లను దూరం పెట్టి సచివాలయ సిబ్బందికి అప్పగించాలనుకున్న వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలింగ్‌ కేంద్రాల ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులుగా టీచర్లను నియమించాలని C.E.O. కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఉపాధ్యాయల వివరాలను సేకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌, పోలింగ్‌ అధికారులుగా పనిచేసేందుకు అర్హత గలవారి వివరాలను అన్ని ప్రభుత్వ శాఖల నుంచి భారత ఎన్నికల సంఘం సేకరిస్తోంది. అందులో భాగంగా ఉపాధ్యాయుల వివరాలనూ ఇవాళ్టిలోగా పంపాలని ఆదేశించింది.


ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు అర్హత ఉన్న అధికారులు, సిబ్బంది వివరాలను పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. జిల్లా పరిధిలో మొత్తం ఎంతమంది పోలింగ్‌ సిబ్బంది అవసరం? ఎన్నికల విధుల నిర్వహణకు ఎంతమంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు? గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మినహా మిగతా శాఖల సిబ్బంది ఎంతమంది ఉన్నారు ? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మొత్తం ఎందరు ఉన్నారు? అంశాలతో వివరాలు పంపించాలని కోరింది. ఈ సమాచారాన్ని సేకరించి ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి C.E.C.కి పంపనున్నారు. ఏపీలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు, వాటిలో అవసరమైన అధికారుల సంఖ్య, అందుబాటులో ఉన్నవారి సంఖ్య తదితర వివరాలు పరిశీలించాక. ఏయే శాఖల ఉద్యోగులను నియమించాలో C.E.C. తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉపాధ్యాయులకూ ఈ బాధ్యతలు ఇవ్వాలని C.E.C. అనుకుంటే వారూ ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతారు. ఇదే జరిగితే జగన్‌ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. అయితే C.E.C. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఉపాధ్యాయులు జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచే ఎత్తుగడ వేసింది. విద్యా హక్కు చట్టానికి సవరణల పేరిట ఉపాధ్యాయులకు బోధన, విద్యా సంబంధిత అంశాలు తప్ప.. బోధనేతర విధులేవీ అప్పగించొద్దని గతేడాది నవంబరు 29న ఉత్తర్వులు జారీచేసింది. మరీ తప్పనిసరైతే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులనూ పూర్తిగా వినియోగించుకున్నాకే ఉపాధ్యాయుల సేవలు వాడుకోవాలని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుల భాగస్వామ్యం, పాత్ర లేకుండా చేసేందుకే ప్రభుత్వం ఉత్తర్వులు తెచ్చిందని వారి స్థానంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కేటాయించాలని భావించిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే బూత్‌ స్థాయి అధికారులుగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో పోలింగ్‌ అధికారులుగా పనిచేసేందుకు అర్హత ఉన్నవారి కోసం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల సమాచారాన్నీ ఎన్నికల సంఘం సేకరిస్తుండటంతో తర్వాత ఏం జరగనుందోననే చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story