AP : ఏపీలో చేపల వేటకు రెండు నెలల బ్రేక్
సముద్రంలో చేపల వేటపై నేటి నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. జూన్ 14 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు రెండు నెలల పాటు విరామం లభించనుంది. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ఏటా ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. కాగా ఈ విరామం సమయంలో కుటుంబానికి రూ.10వేలు చొప్పున మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బంగాళాఖాతంలో వేటకు విరామం ఇవ్వాలి. ఏటా ఏప్రిల్ 15వ నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలోని పశి్చమ బెంగాల్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధం ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది.
జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ (61 రోజులు) ఇది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపల వేట నిషేధం అమలుకు పోలీసుల సహకారంతో మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేట ముగించుకుని తమ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com