Kodali Nani : వాలంటీర్ల ఫిర్యాదు.. కొడాలి నానిపై కేసు నమోదు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ( Kodali Nani ) కేసు నమోదైంది. తమను వేధించి కొడాలి బలవంతంగా తమతో రాజీనామా చేయించారంటూ మాజీ వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులతోపాటు మరికొందరిపై సెక్షన్ 447, 506, రెడ్ విత్ 34 ఐపీసీ కింద గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికలకు ముందు వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీంతో చాలామంది వాలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీ తరపున పని చేశారు. అయితే అనేక చోట్ల వైసీపీ నేతలు ఒత్తిడి చేసి మరీ రాజీనామాలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజీనామా చేసిన వాలంటీర్లను ప్రస్తుతానికి పట్టించుకోకపోవడంతో తమ ఉపాధి పోయిందని మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ నేతలను కోరుతున్నారు.
ఈ క్రమంలో పలు చోట్ల వాలంటీర్లు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వైసీపీకి చెందిన నేతలే తమను బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపిస్తున్నారు. కొడాలి నానిపై కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com