JAGAN: ఏపీ శాసనసభ సమావేశాలకు జగన్

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హాజరు కావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్నారు. మంగళవారం నుంచి శాసనసభకు హాజరుపై జగన్ ఇంకా నిర్ణయానికి రాలేదని సమాచారం. శాసనసభకు, బడ్జెట్ సమావేశాలకు రావడంపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత జగన్... తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కాబోతున్నారు. శాసనసభ, మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించనున్నారు.
ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. 15 పనిదినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com