YCP: వైసీపీ ప్రలోభాల దందా

YCP: వైసీపీ ప్రలోభాల దందా
వైసీపీ నేతలను వెంటాడుతున్న ఓటమి భయం... తాయిళాలతో ఆకట్టుకునేందుకు నేతల యత్నం

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో బరిలో ఉన్న అధికార వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో తాయిళాలతో వాలంటీర్లు, అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులను మచ్చిక చేసుకుని వారితో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయి సిబ్బందిని ఆకట్టుకునేందుకు వైసీపీ నాయకులు తాయిళాలు సమర్పించుకుంటున్నారు.. రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి మార్గాని భరత్ ఓటర్లకు తాయిళాల పంపిణికీ శ్రీకారం చుట్టారు. అనుచరగణం పర్యవేక్షణలో శనివారం నుంచి పలు వార్డుల్లో ఆటోల్లో సరుకు వేసుకుని ఇంటింటికీ వెళ్లి చీరల పంపిణీ చేపట్టారు. ఎంపీ అనుచరులు ఇద్దరు, గృహసారథి, వాలంటీర్లతోపాటు కొందరు సచివాలయ సిబ్బంది పంపిణీని పర్యవేక్షించారు. ఓటరు జాబితా ఆధారంగా పంపిణీ చేస్తూ ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్ కార్డు చూసి తాయిళాలు పంపిణీ చేస్తున్నారు.


అనపర్తి మండలం కొప్పవరంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి పలువురు వాలంటీర్లకు శుక్రవారం బహుమతులు అందజేశారు. పంచాయతీలో 100 శాతం పన్నులు వసూళ్లు చేసిన వారికి సత్కరించి బహుమతులు అందజేసినట్లు ఎమ్మెల్యే తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేశారు. ఇటీవల రాజానగరంలో ఉగాది బహుమతుల పేరిట ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మి వాలంటీర్లకు బహుమతులు అందజేశారు. కోరుకొండ మండలంలో క్షేత్రస్థాయి సిబ్బందికి చీరలు, ప్యాంటు, చొక్కా ఇచ్చారు. గాడాల, మధురపూడి, నిడిగట్ల, బూరుగుపూడి, బుచ్చెంపేట, గుమ్ములూరు, కోరుకొండ, కాపవరం గ్రామాల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు సీఎం జగన్, ఎమ్మెల్యే రాజా చిత్రాలతో ఉన్న సంచులు అందజేశారు.


గ్రామాల్లో ఎమ్మెల్యే రాజా సతీమణి రాజశ్రీ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేపట్టారు. పనిలో పనిగా పలువురు వాలంటీర్లను సత్కరించారు. అధికారపార్టీ నాయకులు బాహాటంగానే తాయిళాలు పంపిణీ చేస్తున్నా అధికార యంత్రాంగం మిన్నకుండిపోవడంపై ప్రజలు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story