AP : రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిది: వెంకయ్యనాయుడు

రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ( Venkaiah Naidu ) ఉద్ఘాటించారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిందని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం ఓ విలువైన పాఠమన్నారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేదేం లేదని అమరావతి రైతులు నిరూపించారని అన్నారు. 1631 రోజుల శాంతియుత ఉద్యమం గొప్పదని పేర్కొన్నారు. చివరకు ప్రజల కోరిక నెరవేరడం సంతోషకరమని అన్నారు.
రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. రైతులు, మహిళలు 1,631 రోజులు శాంతియుతంగా ఉద్యమించడం గొప్ప విషయం. ఆటంకాలను ఎదుర్కొని పట్టుదలతో ముందుకు సాగారు. చివరకు వారి కోరిక నెరవేరడం సంతోషం’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
‘రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి. చట్టసభలు, పాలనా వ్యవస్థ ఒకచోట ఉంటేనే సమన్వయంతో పనిచేసే వీలుంటుంది. అభివృద్ధిని వికేంద్రీకరించాలే తప్ప రాజధానిని కాదు. అమరావతిని అన్ని జిల్లాలతో అనుసంధానించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ( CM Chandrababu Naidu ) మాట ఇచ్చినట్టు అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వసిద్దామ’ని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com