Crime : ఆస్తి పంచి ఇవ్వాలంటూ గొడవలు..కొడుకును చంపిన తండ్రి
ఆస్తి పంచి ఇవ్వాలంటూ తాగొచ్చి తరచూ గొడవపడుతున్న కొడుకును తండ్రి హత్య చేసిన ఘటన ఘటన హయత్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. యాదాద్రి జిల్లా దండుమల్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కొన్నేండ్ల కిందట సిటీకి వచ్చి హయత్ నగర్ పరిధి మునుగనూర్ లోని రామానుజన్ నగర్ కాలనీలో ఉంటున్నాడు. అతని కొడుకు వినయ్ కుమార్(29) నాలుగేండ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకోగా.. తనకు ఇష్టంలేకుండా చేసుకున్నాడని తండ్రి దూరం పెట్టాడు. దీంతో వినయ్ కుమార్ భార్య, కూతురితో ఇంట్లోంచి బయటకు వెళ్లి అద్దెకు ఉంటున్నాడు.
వినయ్ కుమార్ చిన్నతనంలోనే తల్లి మృతి చెందగా శ్రీనివాస్ గౌడ్ మరో పెండ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా వినయ్ కుమార్ తాగి తండ్రి వద్దకు వచ్చి ప్రాపర్టీ షేర్ చేసి ఇవ్వాలని అడుగుతుండగా పలుమార్లు గొడవలు జరిగాయి. మంగళవారం రాత్రి మరోసారి మందు తాగిన వినయ్ కుమార్ తండ్రి వద్దకు వెళ్లి ఫర్నిచర్ బిజినెస్ పెట్టుకుంటానని, తనకి రూ.20 లక్షలు పెట్టుబడి కావాలని అడిగాడు.
ఇంకోసారి ఇరువురు మధ్య గొడవ జరిగింది. దీంతో తండ్రి ఇంట్లోని ఓ పారతో వినయ్ తల, ముఖంపై దాడి చేయగా అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని, గతంలో వినయ్ కుమార్ తన తండ్రిపై దాడి చేసిన కేసు కూడా ఉన్నట్లు హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com