Murder : ప్రేమ పెళ్లికి నో చెప్పారని ప్రియురాలి తల్లిదండ్రుల హత్య

Murder : ప్రేమ పెళ్లికి నో చెప్పారని ప్రియురాలి తల్లిదండ్రుల హత్య

ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు ప్రియురాలి తల్లిదండ్రులను ఓ ఉన్మాది హత్య చేశాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోతు శ్రీనివాస్‌(45), బానోతు సుగుణ (40) దంపతులు పదహారు చింతల తండాలోఉంటున్నారు. వారి కుమార్తె దీపికను గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు గతేడాది నవంబర్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ హనుమకొండలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో బన్నీ ఉన్మాదిగా మారాడు. గురువారం తెల్లవారుజామున ఆయుధంతో ఇంటి ముందు నిద్రిస్తున్న శ్రీనివాస్‌, సుగుణ దంపతులపై దాడికి పాల్పడ్డాడు.

సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. ఈ ఘటనలో దీపిక, ఆమె సోదరుడు మదన్‌లాల్‌ కూడా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్‌, నెక్కొండ సీఐ చంద్రమోహన్‌ పర్యవేక్షణలో చెన్నారావు, గూడూరు, నెక్కొండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గ్రామంలో బందోబస్తు నిర్వహించారు.

Tags

Next Story