Sri Rama Navami : నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈనెల 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా, ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా ఉ.10:30 గంటల నుంచి మ.12:30 గంటల వరకు మిథిలా మండపంలో శ్రీసీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 18న మహా పట్టాభిషేకం జరగనుంది.
బ్రహ్మోత్సవాలు నిర్వహించే వైదిక కమిటీని దేవస్థానం ప్రకటించింది. స్థానాచార్యులు స్థలసాయి ఆధ్వర్యంలో ప్రధానార్చకులు రామం, అమరవాది విజయరాఘవన్, ఆచార్యులుగా కోటి శ్రీమాన్, బ్రహ్మగా అమరవాది గోపాలకృష్ణమాచార్యులు, రుత్విక్లుగా మురళీకృష్ణమాచార్యులు, సీతారామాచార్యులు, పరిచారక రుత్విక్కులుగా రాఘవాచార్యులు, అలంకార రుత్విక్లుగా రామస్వరూప్, విష్ణు వ్యవహరించనున్నారు.
బ్రహ్మోత్సవాలకు భద్రగిరిని ముస్తాబు చేసినట్టు ఈఓ చెప్పారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీటి ఏర్పాట్లు చేశామని, చలువ పందిళ్లు, బట్టలు మార్చుకునే రూంలు రెడీ చేశామన్నారు. కల్యాణం రోజు మిథిలాస్టేడియంలోని అన్ని సెక్టార్లలో మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సప్లై చేస్తామని, ఎల్ఈడీ స్క్రీన్లు పెడతామని చెప్పారు. 250 క్వింటాళ్ల తలంబ్రాలు, 2.50లక్షల లడ్డూలు తయారు చేస్తున్నట్టు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com