NEET Paper Leak : నీట్ పై విచారణ గురువారానికి వాయిదా

నీట్ పేపర్ లీకేజీపై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పేపర్ లీకైన మాట వాస్తవమే. లీకేజీతో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. కానీ ఎంతమందికి చేరిందన్నది గుర్తించలేదు. అన్నీ జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తాం’ అంటూ విచారణను వాయిదా వేసింది.
ఈ ఏడాది నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ వచ్చింది. పరీక్ష పేపర్ లీక్ కావడం సహా పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో అనుమానాలు వచ్చాయి. ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాలతో కేంద్రం 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేసింది. అనంతరం రీ-టెస్ట్ లేదా గ్రేస్ మార్కులు వదులుకోవాలని నీట్ అభ్యర్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది కేంద్రం. ఆ తర్వాత జూన్ 23న రీ-టెస్ట్ నిర్వహించి జులై 1న సవరించిన మార్కుల లిస్ట్ను ప్రకటించింది ఎన్టీఏ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com