Manmohan Singh : మన్మోహన్ సింగ్ మృతికి 7 రోజుల సంతాపం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

Manmohan Singh : మన్మోహన్ సింగ్ మృతికి 7 రోజుల సంతాపం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
X

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తోంది. మన్మోహన్‌ సింగ్‌కు గౌరవ సూచకంగా కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) నిన్న కన్నుమూశారు. గత రాత్రి 8 గంటలకు కొన ఊపిరితో ఉండడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. ఆయనకు ఇంటెన్సివ్ కేర్ అందిస్తున్న క్రమంలో గత రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.

ఆయన మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచారు. పలువురు రాజకీయ నేతలు ఆయన భౌతికకాయానికి వ్యక్తిగతంగా నివాళులర్పిస్తున్నారు. మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర ప్రభుత్వం తరపున 7 రోజుల సంతాప దినాలు పాటించనున్నట్లు ప్రకటించారు. మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.

మన్మోహన్ సింగ్ భారతదేశానికి 13వ ప్రధానమంత్రి. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తర్వాత మన్మోహన్ సింగ్ నాల్గవ సుదీర్ఘకాలం పదవిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్‌బీఐ గవర్నర్‌ వంటి అనేక ముఖ్యమైన పదవులను ఆయన నిర్వహించారు. ముఖ్యంగా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

1991లో నరసింహారావు సారథ్యంలోని మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో, భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, అతను చాలా ముఖ్యమైన చర్యలు తీసుకున్నాడు. మన్మోహన్ సింగ్ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడం గమనార్హం.

Tags

Next Story