Modi Nomination : ఈ నెల 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.

ఉత్తర్ప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ వేసేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. నామపత్రాల దాఖలు సందర్భంగా భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వారణాసిలో మోదీ రోడ్షోకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రధాని మోదీ వారణాసిలో 14వ తేదీన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. భాజపా సీనియర్ నేత సునీల్ బన్సల్ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనులను చక్కబెడుతున్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా....కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ఇది సుమారు నాలుగు గంటలపాటు ఉండనుందని తెలుస్తోంది. అదే రోజు NDA నేతల సమావేశంలో ప్రధాని పాల్గొంటారని సమాచారం.
గతంలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేసిన వివరాల ప్రకారం.. ఆయనకు ప్రస్తుతం 73 ఏళ్లు. 2024 ఎన్నికల ప్రచారంలో నిత్యం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. సగటున మూడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.నామినేషన్కు వెళ్లే ముందు ప్రధాని సోమవారం పట్నాలో మూడు ర్యాలీలను పూర్తిచేసుకొని వారణాసి చేరుకుంటారని తెలుస్తోంది. అక్కడ మరికొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. ఎన్నికల ప్రచారం పూర్తి కానున్న మే చివరి నాటికి మోదీ మొత్తం 180 నుంచి 190 రోడ్షోలు, ర్యాలీలు, సభల్లో పాల్గొనున్నారు.
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీ భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై 3 లక్షల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ప్రధాని గెలుపొందారు. 2019లో సమాజ్వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్పై 4 లక్షల 70 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com