Tamil Nadu : తమిళనాడులో ఓటమిపై అన్నామలై స్పందన

తమిళ నాడులో తమ ఉనికిని చాటాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. ఎగ్జిట్ పోల్స్ లో కనీసం 3 సీట్ల వరకు వస్తాయని అంతా భావించారు. కానీ నిజమైన ఫలితాల్లో సున్నాకే పరిమితమయ్యారు. ముఖ్యంగా బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న కోయంబత్తూర్ ఎంపీ స్థానం నుంచి ఆ పార్టీ చీఫ్ అన్నామలై గెలుస్తారని దేశం మొత్తం భావించింది.
ఈ స్థానంలో అధికార డీఎంకే అభ్యర్థి చేతిలో అన్నామలై ఓడిపోయారు. సీట్లు రాకున్నా గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ తన సీట్ల శాతాన్ని పెంచుకుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆదేశాన్ని అంగీకరిస్తున్నామని, తమకు ఆశించిన సీట్లు రాలేదని చెప్పారు. మూడోసారి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తుందని అన్నారు.
తాము తమిళనాడు నుంచి ఎన్డీయే కూటమికి మద్దతుగా ఎంపీలను పంపుతామని భావించామని.. ఐతే ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషించుకుంటామని అన్నామలై అన్నారు. ఇండియా కూటమి నుంచి ఎన్నికైన ఎంపీలకు కూడా అన్నామలై శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి మంచి పథకాలు తీసుకురావాలని కోరారు. తమిళనాడులో 39 స్థానాల్లో బీజేపీ 23 చోట్ల గట్టి పోటీ ఇచ్చిందన్నారు అన్నామలై. ఈ స్థాయిలో వోట్ షేర్ సాధించడం గడితిన 20 ఏళ్లలో ఇదే తొలిసారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com