Tragic Incident : ముంబైలో గాలివాన బీభత్సం.. హోర్డింగ్ కూలి ముగ్గురు దుర్మరణం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు పెను బీభత్సం సృష్టించాయి. తేలికపాటి వర్షంతో పాటు బలమైన గాలులు వీయడంతో ఘట్కోపార్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ పేకమూడలా కుప్పకూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. సుమారు 57 మంది గాయపడ్డారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. హోర్డింగ్ కింద సుమారు 100 మంది చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఘట్కోపార్ ప్రాంతంలో భారీ బిల్ బోర్డ్ కుప్పకూలి పెనువిపత్తు సంభవించిన ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
'బిల్ బోర్డ్ కింద చిక్కుకున్న 47 మందిని ఇంతవరకూ సురక్షితంగా బయటకు తెచ్చాం. యుద్ధప్రాతిపదికన ముంబై పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్, డిజాస్టర్ మేనేజిమెంట్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాం' అని ఫడ్నవిస్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గర్గాని ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలిపారు. ఎన్టీఆర్ఎఫ్ టీము కూడా రంగంలోకి దింపామని, గ్యాస్ కట్టర్లను కూడా ఘటనా స్థలికి పంపామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com