EC: సీఎస్‌, డీజీపీని బదిలీ చేయండి

EC: సీఎస్‌, డీజీపీని బదిలీ చేయండి
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు.. మరో అధికారిని బదిలీ చేసిన ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకు అనుకూలంగా పనిచేస్తున్న సీఎస్, డీజీపీ సహా ఇతర అధికారులను బదిలీ చేయాలని NDA నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత అరుణ్ సింగ్ నేతృత్వంలో తెలుగుదేశం, జనసే నకేంద్ర ఎన్నికల కమిషనర్లకు వినతిపత్రం అందించారు. ప్రతిపక్ష నేతలను వైసీపీ సర్కార్ వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో స్వేచ్ఛాయుత వాతావరణంలో..ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేయించాలని విజ్ఞప్తి చేశారు.


మరొకరు బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ.... మరో సీనియర్ అధికారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని... బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. తనకంటే దిగువ స్థాయి అధికారికి... బాధ్యతలు అప్పగించి వెళ్లాలని వాసుదేవరెడ్డికి సూచించింది. ఈమేరకు..... సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులను అప్పగించొద్దని స్పష్టం చేసింది. మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై వాసుదేవరెడ్డిపై..... ఈసీ చర్యలు చేపట్టింది. ఈ రాత్రి 8 గంటల్లోపు బెవరేజెస్ కార్పోరేషన్ MDనియామకం కోసం ముగ్గురు IAS అధికారుల పేర్లు పంపాలని సూచించింది.

రాష్ట్రంలో కూడా..

ముఖ్యమంత్రి జగన్ పై రాయిదాడి ఘటనలో లోతైన విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారికి వినతి పత్రం ఇచ్చింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్న విజయవాడ సీపీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలపైనే ఆరోపణలు తలెత్తుతున్నాయని.. దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందన్న విశ్వాసం లేదని జనసేన ఆ ఫిర్యాదులో పేర్కోంది. రాయి దాడి ఘటన చాలా అనుమానాలకు తావిస్తోందని ఈ వ్యవహారాన్ని లోతుగా విచారణ చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ జనసేన పార్టీ నేతలు సీఈఓకి ఫిర్యాదు చేశారు. రాయిదాడి ఘటన ముఖ్యమంత్రి భద్రతనే సవాలు చేసేలా ఉందని జన సేన పేర్కోంది. మరోవైపు ఇటీవల ప్రధాని పాల్గోన్న సభలోనూ భద్రతా వైఫల్యం తలెత్తిందని ఈ ఘటనలోనూ సరైన విచారణ జరగలేదని జనసేన తన ఫిర్యాదులో పేర్కోంది.

ఎన్నికల షెడ్యూలు ప్రకటన నుంచి ఏపీలో అధికార పార్టీ వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్పడ్డారని పేర్కోంటూ వినతిపత్రం ఇచ్చింది. ఈ హింసాత్మక ఘటనలు జరిగినా సదరు పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించి కేసులు కూడా నమోదు చేయలేదని టీడీపీ నేతలు వర్లరామయ్య, జవహర్ తదితరులు ఆరోపించారు. వీరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని విధుల నుంచి తప్పించాలని కోరుతూ సీఈఓకి వినతిపత్రం ఇచ్చినట్టు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story