ఎన్నికల ప్రచారానికి శ్రీవారి లడ్డూలు.. వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం ఇది : లోకేశ్

ఎన్నికల ప్రచారానికి శ్రీవారి లడ్డూలు.. వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం ఇది : లోకేశ్
ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే మొబైల్ వ్యానులో శ్రీవారి ప్రసాదాన్ని తీసుకెళ్లి ఓటర్లకు పంచుతున్నారు.

పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వైసీపీ నేతలు శ్రీవారి ప్రసాదాన్ని కూడా వదలడం లేదు. ఓటర్ స్లిప్పులు అందజేస్తూ.. దాంతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని కూడా పంచారు. చిత్తూరు జిల్లా తొండవాడ పంచాయతీలో వైసీపీ నేతల అరాచకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులకు ఎంతో ఇష్టమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఓటర్లకు పంచుతూ ప్రలోభపెడుతున్నారు.

పైగా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే మొబైల్ వ్యానులో శ్రీవారి ప్రసాదాన్ని తీసుకెళ్లి ఓటర్లకు పంచుతున్నారు. లడ్డూ తీసుకోండి, మాకు ఓటు వేయండంటూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.. ఈ తరహాలో ఓట్లను అభ్యర్థించడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బహిరంగంగా ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

అటు ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూలను ఓట్ల స్లిప్పులతో కలిసి పంచుతూ స్వామివారికి మహాపచారం తలపెట్టారని మండిపడ్డారు. జగన్‌ రెడ్డికి, వైసీపీ నేతలకు ఎన్నికలపైనే కానీ, ఏడుకొండలవాడిపై భక్తిలేదని ట్వీట్ చేశారు. సన్నాసుల సన్నబియ్యం వ్యాన్లలో లడ్డూలను తరలించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు.

ఎస్సీలకు 5 లడ్లు, ఇతరులకు 10 లెక్క చొప్పున పంపిణీ చేసి.. కులవివక్ష చూపారన్నారు. ఓట్లకు కోట్లు వెదజల్లుతున్నా.. పల్లెల్లో జగన్ రెడ్డిని జనం నమ్మడం లేదని దుయ్యబట్టారు నారా లోకేష్.

శ్రీవారి లడ్డూలిస్తే భక్తితోనైనా ఓటేస్తారని వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం ఇది అంటూ లోకేష్ మండిపడ్డారు. హిందువులకు అత్యంత పవిత్రమైన లడ్డూలను ఓటర్లకు తాయిలాలుగా పంచిన అభ్యర్థి పోటీకి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొండపై భక్తులకు ఒక లడ్డూ దొరకని పరిస్థితిలో.. ఇన్ని వేల లడ్డూలు తరలించిన వైసీపీ నేతలు, వారికి అందించిన టీటీడీ యంత్రాంగంపై చర్యలు చేపట్టాలని కోరారు.

స్వామికి జరిగిన అపచారం, వ్యాన్లలో తరలింపు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, కులవివక్షలపై కేసులు నమోదు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

అటు.. పంచాయతీ ఎన్నికల్లో ప్రసాదాన్ని ప్రలోభాలకు వినియోగించడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని.. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

సామాన్య భక్తులు ప్రసాదాలు తీసుకోవాలంటే సవాలక్ష నిబంధనలతో ఇబ్బంది పెడుతున్న టీటీడీ ఛైర్మన్.. వైసీపీ నేతలకు లక్షల సంఖ్యలో ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. ఓటరు స్లిప్పులతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని పంచడంపై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చివరకు దేవుడి ప్రసాదంతోనూ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story