AP: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కిన సర్పంచులు

AP: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కిన సర్పంచులు
ఉత్సవ విగ్రహాల్లా మారామని ఆవేదన... కేంద్ర నిధులు విడుదల చేయాలని డిమాండ్‌

గ్రామాభివృద్ధి నిధులు మళ్లించి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులు, సర్పంచ్ లకు అధికారాలు లేక ఉత్సవ విగ్రహాల్లా మారామని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్పంచ్ లు రోడ్డెక్కారు. నిధులు విడుదల చేసేలా మహాత్ముడైనా జగన్ కళ్లు తెరిపించాలంటూ విభిన్న రూపాల్లో నిరసన తెలిపారు. అనంతపురంలో కలెక్టరేట్ ఎదుట సర్పంచులు నిరసన దీక్ష చేపట్టారు. కర్నూలులో నిరసనకు దిగిన సర్పంచులుకేంద్రం విడుదల చేసిన 10 వేల కోట్లను జగన్ సర్కార్ పంచాయతీల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. ఏలూరులో సర్పంచులకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మద్దతు తెలిపారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిల్చుని, శ్రీకాకుళంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని సర్పంచులు నిరసన తెలిపారు.


అనంతపురంలో కలెక్టరేట్‌ ఎదుట సర్పంచులు నిరసన దీక్ష చేపట్టారు. గ్రామాలను అభివృద్ధి చేస్తామని పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసి గెలుపొందిన తాము... కనీసం మురుగుకాల్వలూ శుభ్రం చేయించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన 10 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీల ఖాతాలకు జమ చేయాలని కర్నూలులో నిరసన దీక్షలో సర్పంచులు కోరారు. నెల్లూరులో గాంధీ విగ్రహం ఎదుట సర్పంచులు ఆందోళన చేపట్టారు. పంచాయతీల నిధులను పక్కదారి పట్టించడంతో గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని వాపోయారు.


రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సర్పంచులను బిచ్చమెత్తుకునేలా చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఏలూరులో సర్పంచుల ధర్నాకు చింతమనేని మద్దతు తెలిపారు. అనకాపల్లి కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిల్చుని సర్పంచులు నిరసన తెలిపారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తే తెలంగాణలో కేసీఆర్‌కు పట్టిన గతే జగన్‌కు పడుతుందని హెచ్చరించారు. శ్రీకాకుళంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు. జాతిపిత కలలు కన్న గ్రామస్వరాజ్యం రాష్ట్రంలో లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా పంచాయతీలకు రావాల్సిన నిధులు, విధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story