Alert : జాగ్రత్త.. మరో 5 రోజులు మస్తు ఎండలు
వేసవి (Summer) ప్రారంభం కాకముందే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం ఆరంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండ వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియసు దాటింది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎండలు మరింత దంచికొట్టే అవకాశం ఉంది. రోజువారీ సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
దీంతో పగటి వేళలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎల్నినో ప్రభా వంతో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీసే అవకాశాలున్నాయని తెలిపింది. మార్చి-మే మధ్య కాలంలో దేశంలో అనేక చోట్ల సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ గతంలోనే హెచ్చరించింది.
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియసు దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారంనాడు హైదరాబాద్ నగర పరిధిలో ఎల్బీనగర్ 35 డిగ్రీలు, బేగంపేటలో 34 డిగ్రీలు, జూబ్లీహిల్స్లో 33 డిగ్రీలుగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో కార్యాలయాలకు వెళ్లే వాహన దారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com