మంత్రి పదవి ఇస్తానంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అరుణ్జైట్లీ మాత్రం భిన్నంగా స్పందించారు. గత ఐదేళ్లు మోదీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. అనారోగ్యం కారణంగా ప్రస్తుత సర్కారులో భాగస్వామి కాలేనంటూ తప్పుకుంటున్నారు. నిజానికి.. కేబినెట్ కూర్పుపై మోదీ, అమిత్షా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. గత కేబినెట్లో కీలక శాఖలు చూసిన రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, పీయూష్ గోయల్, ప్రకాష్ జావ్దేకర్లకు మళ్లీ ప్రాధాన్య పోస్టులే ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. వాళ్లకు పాత పోస్టులే ఇస్తారనీ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి లేఖ రాశారు అరుణ్ జైట్లీ. తన అనారోగ్యాన్ని గుర్తుచేస్తూ.. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించలేనని అన్నారాయన.
మోదీ ప్రభుత్వం కొత్త ఆర్థిక మంత్రి ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అమిత్షా కు ఆ పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం లేని ఆయనకు ఆర్థిక శాఖ ఇవ్వకపోవచ్చనే వాదనా ఉంది. అరుణ్జైట్లీ చికిత్స చేసుకునేందుకు ఫారిన్ వెళ్లినప్పుడల్లా.. ఆ శాఖ బాధ్యతలు చూసిన పీయూష్ గోయల్కు ఫుల్టైమ్ బాధ్యతలు అప్పగించవచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పీయూష్ గోయల్కు సమర్థుడిగా పేరుంది.