ఈనెల 7వ తేదీన వైసీపీఎల్పీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జగన్ అధ్యక్షతన జరిగే శాసన సభాపక్ష సమావేశంలో.. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులకు విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో.. అవకాశం దక్కనివాళ్లు నిరాశపడకుండా ఉండేలా వారికి భరోసా ఇస్తారని తెలుస్తోంది.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. పార్టీ కోసం 10 ఏళ్లుగా కష్టపడ్డ వాళ్లంతా ఇప్పుడు శాసనసభలో అడుగుపెడుతుండడంతో.. పదవులకు తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కూడా పెద్ద కసరత్తే చేసినా లెక్క తేలడం లేదు. జిల్లాకు ఇద్దరు ముగ్గురు ముఖ్యనేతలు, సీనియర్లు ఉండడంతో.. పదవుల పందేరం జగన్కు కాస్త ఇబ్బందిగానే మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరెవరికి కేబినెట్లో అవకాశం ఇస్తున్నారు.. తర్వాత ఫేజ్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.
ఈనెల 8న మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఐతే.. పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్లోకి తీసుకుంటున్న వారికి ఎందుకు అవకాశం ఇచ్చారు అనేది వివరిస్తూ.. 7వ తేదీన జగన్ సమావేశం ఉండబోతోంది. ఎక్కడా అసంతృప్తికి తావు ఇవ్వకుండా అందరికీ భవిష్యత్ పై భరోసా ఇచ్చేలా సీఎం సమావేశంలో తన అంతరంగాన్ని వారికి వివరించనున్నారు.