Chandra Babu : వైసీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు రియాక్షన్
మేనిఫెస్టో కాదు.. రాజీనామా పత్రం అంటూ విమర్శలు
వైకాపా మేనిఫెస్టోపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని, వైకాపా నవరత్నాలు వెలవెల పోతున్నాయని పేర్కొన్నారు. ఏం చేయలేనని జగన్ చేతులెత్తేశారని అన్నారు. మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్ , ఖురాన్ అన్న జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మేనిఫెస్టో 99శాతం అమలు చేస్తే.., ప్రజల జీవితాలు ఎందుకు మారలేదని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామనే హామీ.. మేనిఫెస్టోలో లేదని, కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకం DSCపైనే పెడతానని తెలిపారు. రైతులకు ఏటా 20వేల రూపాయలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నేరాలు, ఘోరాలు చేయడంలో సీఎం జగన్ పీహెచ్ డీ చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్లలో జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని రాష్ట్రంలో ఉత్తర కొరియా పరిస్థితిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఏ రంగంలో చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. భూములు, గనులు, ఇసుక, డ్రగ్స్ సహా చేసే ప్రతిపనిలో కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భద్రత లేకుండాపోయిందని విమర్శించారు. అన్ని పాపాలు చేసి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదని గ్రహించి గులక రాయి డ్రామాతో సానుభూతి ఓట్లు పొందాలని చూశారని ఆక్షేపించారు. ఇప్పుడు ఆ ఎత్తుగడ ఫలించపోవడంతో..ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారని చంద్రబాబు విమర్శించారు.
సీపీఎస్ (CPS) రద్దు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను ప్రస్తవించలేదని మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని పేర్కొన్న జగన్ హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేశారని అన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి గోదావరిలో కలిపారని వెల్లడించారు. అంశం గతంలో తమ పరిపాలన స్వర్ణయుగం కాగా వైసీపీ పాలన రాతియుగమని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్పీ పైనే ఉంటుందని పేర్కొన్నారు.