రేపు 25 మందితో పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని స్పష్టం చేసిన జగన్..ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్ల తరువాత కేబినెట్లో కొత్తవారికి అవకాశం ఇస్తామని జగన్ తెలిపారు. మంత్రి వర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వైసీపీ శాసన సభా పక్ష సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చారు జగన్.
మనం వేసే ప్రతి అడుగు మనల్ని ప్రజలకు దగ్గర చేయాలని నేతలకు జగన్ సూచించారు. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలన్న సీఎం జగన్.. ఆరోపణలు వచ్చిన పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపడతామన్నారు. చంద్రబాబు పాలనలో అంచనాలు పెంచి టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు జగన్.