వావి వరుసల్లేకుండా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. తాజాగా గుంటూరు జిల్లా కొల్లూరులో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. టెన్త్ క్లాస్ చదువుతున్న మైనర్ బాలికను అన్న వరసయ్యే బంధువు గర్భవతిని చేశాడు. తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లగా బాలికను బంధువుల ఇంట్లో ఉంచారు. అన్న వరసయ్యే లారీ డ్రైవర్ కన్ను బాలికపై పడింది. గతంలోనూ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో బాలికపై అత్యాచార యత్నం చేశాడు. అయితే ఆ బాలిక అరవడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత తన భార్యను తెనాలికి పంపి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరోసారి బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.
ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఆ తర్వాత కూడా పలుమార్లు అత్యాచారం చేశాడు లారీ డ్రైవర్. అయితే రెండు రోజుల కిందట బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళితే పరీక్షించిన వైద్యులు బాలిక గర్భం దాల్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులు బాలికను విచారించగా అసలు విషయం చెప్పింది. తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని వివరించింది. విషయం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు పెద్దలు. ఈ మేరకు కొల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాలికను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి బాలికను పరామర్శించి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.