నిజామాబాద్ జిల్లాలో జనావాసాల మధ్యకు వచ్చి బీభత్సం సృష్టించిన ఎలుగుబంటిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు బంధించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ రెస్క్యూ టీం ..డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఎలుగుబంటికి మత్తుమందు ఇచ్చి బంధించారు. అంబులెన్స్లో జూ పార్కుకు తరలించారు.
గ్రామంలోని ఓ ముళ్ల పొదల్లో దాక్కున్న ఎలుగుకు ఓ గన్ సాయంతో మత్తు ఇచ్చి దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు.. అది మరో ముళ్ల పొదల్లోకి పారిపోయింది. దీంతో అధికారులు చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. మత్తు ఇంజెక్షన్కు చిక్కకపోతే వలలోనైనా చిక్కుతుందని ఆ దిశగా ప్రయత్నాలు చేసి చివరకు దాన్ని బంధించడంలో సఫలీకృతమయ్యారు.
తొలుత ధర్మారం గ్రామంలో మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. గ్రామస్తులు తరమడంతో రెండు పరారయ్యాయి. గ్రామంలో చొరబడిన ఎలుగుబంటి ఐదుగురిపై దాడి చేసింది. ప్రస్తుతం వారికి నిజామాబాద్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. ఎట్టకేలకు ఎలుగుబంటి అధికారులకు చిక్కడంతో అక్కడి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.