ఏపీ కాంగ్రెస్‌లో మరో కొత్త వివాదం

Update: 2019-08-06 13:25 GMT

125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో అసలుందా అనే పరిస్థితికి చేరింది. 2014, 19 ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు ప్రజల మనసుల్లో నుంచి చెరిగిపోలేదు. అందుకే ద్వేషిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు వలస పోవడంతో కాంగ్రెస్‌ దాదాపు ఖాళీ. ఒకానొక దశలో పార్టీ జెండా పట్టుకునే కార్యకర్తలు లేరంటే అతిశయోక్తి కాదు. ఏపీలో బలోపేతానికి పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరా రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఉన్న కొద్దిమందిలో నైరాశ్యం. పార్టీని నడపడం కష్టం కావడంతో పాటు ఆర్థిక భారం మోయడం తనవల్ల కాదంటూ రఘువీరారెడ్డి రాజీనామా చేశారు.

రఘువీరా రెడ్డి స్థానంలో అధ్యక్ష పదవి కోసం సీనియర్లు అధిష్టానం దగ్గర లాబీయింగ్‌ చేస్తున్నారు. అయితే పీసీసీ కొత్త చీఫ్‌గా పల్లంరాజు నియమితులు అయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో.. ఆశావహుల్లో అలజడి మొదలైంది. పైకి కలిసి పనిచేస్తామంటూ చెప్తున్నా.. ఎవర్నీ భర్తీ చేయలేదని తెలీడంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాను కూడా రేసులో ఉన్నట్టు మాజీ మంత్రి శైలజానాథ్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ అంటేనే లాబీయింగ్‌కు పెట్టింది పేరు. కౌన్ బనేగా పీసీసీ ప్రెసిడెంట్ అన్నట్టు ఏపీ కాంగ్రెస్‌లో షో నడుస్తోంది. మరి, పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.

Similar News