ఎన్నికల తర్వాత తొలిసారి విశాఖలో పర్యటించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు..ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో తప్పుడు నిర్ణయంతో ప్రజలు పడుతున్న అవస్థను హైలెట్ చేస్తూ ప్రభుత్వం తీరును కడిగిపారేశారు చంద్రబాబు. ఈ నాలుగు నెలల పాలనలో ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాలు రాష్ట్రానికి పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చాయని అన్నారు.
రాష్ట్రంలో అణిచివేత విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో కార్యకర్తల వేధింపులు, ప్రశ్నించే మీడియాపై నిషేధం విధింపుతో నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. టీవీ5, ఏబీఎన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు జగన్ సిగ్గుపడాలంటూ ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హెచ్చరించినా ఇంకా దారికి రాకపోవడం శోచనీయమన్నారు.
అధికార పార్టీ వేధింపు రాజకీయాలకు దిగజారిందని చంద్రబాబు ఆరోపించారు. అక్రమ కేసులు, ఇసుక కొరత, విద్యుత్ కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఎప్పుడైనా విద్యుత్ సమస్యలు వచ్చాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వంలో చివరికి మందుబాబుల దగ్గర కూడా జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం టెండర్ల దగ్గర్నుంచి..కృష్ణా, గోదావరి బేసిన్ లో నీటి మళ్లింపు వరకు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. ఇక పార్టీ బలోపేతంపైనా కేడర్ కు సూచనలు చేశారు. యువనాయకులు తయారు చేస్తామన్న చంద్రబాబు..టీడీపీలో కార్యకర్తలే నాయకులు అని అన్నారు.