ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్యపై సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్.. తమ బృందాన్ని హైదరాబాద్కు పంపించింది. నేరుగా శంషాబాద్లోని ప్రియాంకారెడ్డి ఇంటికి వెళ్లిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు... ప్రియాంక తల్లిదండ్రులను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు ఘటనా స్థలంతో పాటు స్కూటీ పార్కింగ్ చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు..
ప్రియాంకా హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగి ఉండొచ్చని అన్నారు జాతీయ మహిళా కమిషన్ విచారణ కమిటీ చైర్పర్సన్ శ్యామల కుందర్.లారీ డ్రైవర్, క్లీనర్లు రెండ్రోజుల నుంచి మందు తాగుతూ.. అక్కడే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. పెట్రోలింగ్ వాహనం ఎందుకు లేదని ప్రశ్నించారు. ఘటన జరిగాక సీసీ కెమెరాలు చూసి ఏం లాభమని ప్రశ్నించారు శ్యామలా కుందర్. పోలీసుల తీరుపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలే కాదు దేశ వ్యాప్తంగా ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య ఘటన సంచలనం రేపుతోంది. ఈ దారుణాన్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రియాంక ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఎన్ఎస్యూఐ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుల దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
ప్రియాంకను హత్య చేసిన వాళ్లను సమాజంలో బతనివ్వొద్దని నినదించారు విద్యార్థులు. నిందితులకు కఠిన శిక్ష విధించి ప్రియాంకకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీతో పాటు ముంబై, కొల్కతా, చెన్నైతో పాటు పలు నగరాల్లో ప్రియాంకారెడ్డి హత్యను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. మరోసారి ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తున్నారు.